paripurnananda: మీ ఆంధ్రా ప్రవచనాలు తెలంగాణ ప్రజలపై రుద్దకండి!: పరిపూర్ణానందకు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సూచన

  • ముందు ఆయన అబద్ధాలు చెప్పడం మానేయాలి
  • తాను ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కనడం వృథా
  • తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలేమీ లేదు

స్వామి పరిపూర్ణానంద ఆంధ్రా ప్రవచనాలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదని, వాటిని ఆయన బలవంతంగా ఇక్కడి వారిపై రుద్దాలని ప్రయత్నం చేయొద్దని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సూచించారు. మతతత్వ రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ మరో స్వామీజీని తెచ్చి తెలంగాణ ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాను ముఖ్యమంత్రి అయిపోతానని పరిపూర్ణానంద పగటి కలలు కంటున్నారని, ఆయన ఆశలు నెరవేరవని చెప్పారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలేమీ లేదని, అందువల్ల పరిపూర్ణానంద అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

‘విభజన హామీలు నెరవేర్చాలని పార్లమెంటులో నిలదీసినా పట్టించుకోలేదు. హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను తుంగలో తొక్కారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఓట్ల కోసం బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు’ అంటూ ప్రభాకర్‌ హెచ్చరించారు.

More Telugu News