Andhra Pradesh: తండ్రి పొత్తు లేకుండా గెలవలేడు.. కొడుకు అసలు ఎన్నికల్లోనే గెలవలేడు!: చంద్రబాబుపై రోజా సెటైర్లు

  • జగన్ కు భద్రత కల్పించలేని సీఎం సిగ్గుపడాలి
  • సొంత ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోయారు
  • టీడీపీని దొంగల పార్టీగా మార్చేశారు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కు భద్రత కల్పించలేనందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు సిగ్గుపడాలని వైసీపీ నేత రోజా విమర్శించారు. జగన్ పై దాడి జరిగితే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు వెకిలిగా నవ్వుతూ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని దొంగల పార్టీగా మార్చిన చరిత్ర చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు.

చంద్రబాబు వైఖరి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. జగన్ పై దాడి కేసులో సీఎం చంద్రబాబు ఏ1 ముద్దాయి అని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను చంపేసినా కాపాడుకోలేని దారుణమైన స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఇతర పార్టీలతో పొత్తు లేకుండా గెలవలేని పరిస్థితిలో చంద్రబాబు ఉంటే, అసలు ఎన్నికల్లో నిల్చుని గెలవలేని స్థితిలో ఆయన కుమారుడు లోకేశ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పై దాడి జరిగి 10 రోజులైనా ఇంకా అసలు కుట్రదారులను గుర్తించకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే ఈ హత్యాయత్నం చేయించారని ఆరోపించారు.

More Telugu News