Andhra Pradesh: వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల కారణంగానే జగన్ ను చంద్రబాబు పరామర్శించలేదు!: మంత్రి పుల్లారావు

  • వైసీపీ నేతలు ప్రభుత్వంపై అపవాదు మోపారు
  • కోడికత్తి పార్టీకి జనం ఓట్లు వేయరు
  • సానుభూతి పొందేందుకు జగన్ యత్నించారు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులెవరూ పరామర్శించలేదని వైసీపీ నేతలు విమర్శించడంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంపై అపవాదు మోపినందునే జగన్ ను ఆయన పరామర్శించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రాలో ప్రజలు కోడికత్తి పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ దాడి ఘటనతో సానుభూతి పొందేందుకు జగన్ యత్నించారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎంతగా దూషిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ అంతగా పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిని కూడా చంద్రబాబు వదులుకున్నారనీ, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం బీజేపీయేతర పార్టీలను ఆయన ఏకం చేస్తున్నారని వెల్లడించారు. జగన్ పై దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారనీ, వారే ఈ దాడికి కుట్ర పన్నారని వైసీపీ నేతలు గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

More Telugu News