Anil Parihar: జమ్ముకశ్మీర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అతడి సోదరుడిని కాల్చి చంపిన దుండగులు.. ఉద్రిక్తత

  • చికిత్స పొందుతూ మృతి చెందిన సోదరులు
  • ఆసుపత్రి, పోలీస్ స్టేషన్‌పై దాడి
  • కర్ఫ్యూ విధించిన పోలీసులు

జమ్ముకశ్మీర్‌లో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్, అతడి సోదరుడు అజిత్‌ను గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు. అనిల్ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. రక్తపు మడుగులో కుప్పకూలిన ఇద్దరినీ స్థానికులు వెంటనే కిష్టావర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

వారి మృతి వార్త తెలిసిన వెంటనే ఆందోళనకారులు ఆసుపత్రిపై దాడి చేశారు. అనంతరం కిష్టావర్ పోలీస్ స్టేషన్‌పైనా ఆందోళనకారులు దాడికి దిగారు. దీంతో జమ్మూ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో కిష్టావర్‌లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. 2008 ఎన్నికల్లో కిష్టావర్ నియోజకవర్గం నుంచి అనిల్ బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. ఆయన సోదరుడు అజిత్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకో స్టేషనరీ షాపు కూడా ఉంది. దుకాణం మూసి ఇద్దరూ కలిసి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

More Telugu News