modi: మోదీపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

  • పటేల్ విగ్రహం పక్కన శిలాఫలకంపై ‘తెలుగు’లో ఉంది
  • స్వార్థ ప్రయోజనాల కోసం విష ప్రచారం తగదు
  • అమరావతి శంకుస్థాపనప్పటి శిలాఫలకం ఇంగ్లీష్ లో ఉంది!

తెలుగు ప్రజలను, తెలుగు భాషను గౌరవిస్తున్న ప్రధాని నరేంద్రమోదీపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ కి సంబంధించిన శిలాఫలకంపై తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పించలేదని చంద్రబాబు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ వరుస ట్వీట్ల ద్వారా స్పందించారు. ‘చంద్రబాబు గారు దేశ ఐకమత్యానికి చిహ్నమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’పై తన స్వార్థ ప్రయోజనాల కోసం తన అనుకూల మీడియా సహకారంతో విషప్రచారాన్ని చేస్తున్నారు. పటేల్ గారి విగ్రహం పక్కన శిలాఫలకంపై చాలా స్పష్టంగా ‘ఐక్య భారతం - శ్రేష్ఠ భారతం’అని తెలుగులో రాసి ఉంది.

తెలుగు ప్రజలను, తెలుగు భాషను గౌరవిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ గారిపై తన 40 సంవత్సరాల అనుభవంతో బాబు గారు మీడియాని గుప్పిట్లో పెట్టుకుని విషప్రచారం చేస్తున్నారు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనలో చంద్రబాబు గారు తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లోని శిలాఫలకం ఆవిష్కరించారు. తెలుగు పట్ల చంద్రబాబు గారు అగౌరవంగా ప్రవర్తించారు’ అని ఆరోపించారు. ఈ ట్వీట్లతో పాటు ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు.

More Telugu News