Jagan: జగన్ పై హత్యాయత్నం కేసు... ఇద్దరు యువతుల అరెస్ట్!

  • పిడుగురాళ్లలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • ప్లాట్ లో ఉన్న అమ్మాయిలేనని అనుమానం!
  • వీరిలో ఒకరు పార్టీకి హాజరైనట్టు భావిస్తున్న పోలీసులు!

గత వారంలో విశాఖ ఎయిర్ పోర్టులో వైకాపా అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసు విచారణ, నెమ్మదిగా సాగుతూ, రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. తాజాగా, ఈ కేసులో సంబంధముందన్న అనుమానంతో పోలీసులు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు వచ్చిన సిట్ బృందం, వీరిని అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించింది.

ఎయిర్ పోర్టుకు సమీపంలో శ్రీనివాసరావు ప్లాట్ లోని మరో గదిలో ఉన్న అమ్మాయిలు వీరేనా? అన్న విషయం తెలియరాలేదు. వీరిలో ఒకరు శ్రీనివాసరావు తన స్నేహితులకు పార్టీ ఇచ్చిన సమయంలో వచ్చిన యువతిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అమ్మాయితో పలు మార్లు శ్రీనివాస్ మాట్లాడాడని తెలుస్తోంది.

మరోవైపు మధ్యప్రదేశ్ లోని శ్రీనివాస్ స్నేహితుడిని కూడా విశాఖ రప్పించారు. అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కాగా, నిందితుడు శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉందని, నేడు నాలుగో రోజు కస్టడీలో భాగంగా అతన్ని విచారిస్తామని పోలీసులు అంటున్నారు.

More Telugu News