Bangaluru: భార్య కాపురానికి రాలేదని.. పిల్లలపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన తండ్రి!

  • మద్యానికి బానిసైన భర్త
  • విసిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
  • పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించిన కసాయి

భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు నిప్పు పెట్టి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అంజనాపురానికి చెందిన శ్రీనివాసమూర్తి ఎలక్ట్రీషియన్. మద్యానికి బానిస కావడంతో భార్యతో తరచూ గొడవలు జరిగేవి. దీంతో అతడిని భరించలేని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు పిలిచినా ఆమె తిరిగి రాకపోవడంతో ఉన్మాదిగా మారాడు.

శనివారం మరోమారు ఆమె దగ్గరికి వెళ్లిన శ్రీనివాసమూర్తి తనతో రావాల్సిందిగా కోరాడు. ఆమె నిరాకరించడంతో పిల్లలు చేతన్ సాయి (5), సాయిచరణ్ (2)లను తనతోపాటు తీసుకువచ్చాడు. అనంతరం అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో పిల్లలపై పెట్రోలు పోసి నిప్పటించాడు. అనంతరం తాను కూడా నిప్పు పెట్టుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో సాయిచరణ్ మృతి చెందగా, చేతన్ సాయి, శ్రీనివాసమూర్తి తీవ్ర గాయాలపాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News