Tollywood: బ్రాహ్మణులపై ద్వేషంతో చోరీలు.. ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ అరెస్ట్!

  • వంద సినిమాలకు పైగా పాటలు
  • బ్రాహ్మణులు దూరం పెట్టడంతో ద్వేషంతో చోరీల బాట
  • అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు

సినీ గేయ రచయిత తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్ (47)ను హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆలయ పూజారి చేతి సంచిని చోరీ చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణంలోని సింహాచలానికి చెందిన కులశేఖర్ హైదరాబాద్ మోతీనగర్‌లో ఉంటూ సినిమాలకు పాటలు రాస్తున్నాడు. దాదాపు వందకుపైగా పాటలు రాసిన కులశేఖర్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

దీంతో గత కొంతకాలంగా పరిశ్రమకు, కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట బ్రాహ్మణులను కించపరిచేలా ఉందంటూ ఆ సామాజిక వర్గం అతడిని దూరం పెట్టింది. దీంతో బ్రాహ్మణులపై కక్ష పెంచుకున్న ఆయన ఆలయాలు, పూజారులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. 2016లో కాకినాడలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శఠగోపాన్ని చోరీ చేశాడు. ఈ కేసులో రాజమండ్రి జైలులో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు.  

మూడు రోజుల క్రితం ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో ఉన్న మాతా దేవాలయంలోని పూజారి చేతి సంచిని దొంగిలించాడు. ఆదివారం శ్రీనగర్ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించిన కులశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతడి నుంచి రూ.50 వేల విలువైన 10 మొబైల్ ఫోన్లు, రూ.45 వేల విలువైన ఇతర వస్తువులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, తాళం చెవులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు పంపారు.

More Telugu News