Andhra Pradesh: జగన్ పై దాడికి వాడిన కత్తి మీ దగ్గరే ఉందని టీడీపీ నేతల ఆరోపణలు.. స్పందించిన బొత్స మేనల్లుడు మజ్జి!

  • రాష్ట్ర పోలీసులపై నాకు నమ్మకం లేదు
  • సీఐఎస్ఎఫ్ అధికారులకే జవాబిస్తా
  • త్వరలోనే ప్రజాసంకల్ప యాత్ర మొదలవుతుంది

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడికి వినియోగించిన కత్తి తన వద్ద ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపించడాన్ని బోత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) అధికారులకే జవాబు ఇస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదని మజ్జి స్పష్టం చేశారు. కొందరు టీడీపీ నేతలు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయనగరంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తనకు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం ఉందనీ, అయితే పోలీసులపై మాత్రం విశ్వాసం లేదని స్పష్టం చేశారు. అసలు నేరం జరిగిన గంటలోనే దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తేనని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడ్డారు. సోమిరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. జగన్ త్వరలోనే కోలుకుని పాదయాత్ర ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News