Miss Paraguay: ఆనందాన్ని తట్టుకోలేక.. స్టేజిపైనే కుప్పకూలిన అందాల పోటీ విజేత!

  • విజేతగా ప్రకటించిన వెంటనే స్పృహ తప్పిన మిస్ పరాగ్వే
  • మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీల్లో ఘటన
  • రన్నరప్‌గా భారత్ బ్యూటీ మీనాక్షి చౌదరి

ఆనందం, దు:ఖం.. ఏదొచ్చినా తట్టుకోవడం కొంచెం కష్టమే. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఘటన. అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఓ భామ.. నిర్వాహకులు తన పేరు ప్రకటించగానే ఆనందాన్ని తట్టుకోలేక స్టేజిపైనే స్పృహ కోల్పోయి కుప్పకూలింది. మిస్ పరాగ్వే పోటీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

గురువారం మయన్మార్‌లోని యాంగాన్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీల్లో పరాగ్వే బ్యూటీ క్లారా సోసా విజేతగా ఎంపికైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. అంతే.. తన పేరు వినగానే ఆనందాన్ని తట్టుకోలేక స్పృహ తప్పి స్టేజీపైనే కుప్పకూలింది. రన్నరప్ అయిన భారత భామ మీనాక్షి చౌదరి వెంటనే స్పందించి ఆమెకు సపర్యలు చేసింది. దీంతో కోలుకున్న సోసా తేరుకుని లేచి చేతులూపి నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

అంతకుముందు జరిగిన ఇంటర్వ్యూలో సోసా మాట్లాడుతూ.. తనకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉందని, వైద్యుడి అవసరం ఉందని పేర్కొంది. విజేతగా నిలిస్తే ప్రపంచంలో హింస, యుద్ధాలకు పుల్‌స్టాప్ పెట్టాలంటూ తొలుత ఏ దేశంలో ప్రచారం చేస్తారన్న ప్రశ్నకు సోసా స్పందిస్తూ తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తానని పేర్కొంది. ఇతర దేశాలకు అమెరికా ఓ ఉదాహరణ అని, కాబట్టి తొలుత తాను ట్రంప్‌ను కలుస్తానని వివరించింది.

More Telugu News