KCR: మళ్లీ గేయ రచయిత అవతారం ఎత్తిన కేసీఆర్!

  • గతంలో 'జైబోలో తెలంగాణ' చిత్రం కోసం పాట రాసిన కేసీఆర్
  • అసెంబ్లీ ఎన్నికల కోసం కలం పట్టి, రెండు పాటలు
  • ఇప్పటికే రికార్డింగ్ కు వెళ్లిన పాటలు

తనలోని గేయ రచయితకు కేసీఆర్ మరోసారి పని పెట్టారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల కోసం స్వయంగా కలం పట్టిన ఆయన, రెండు పాటలను రాశారు. గతంలో 'జైబోలో తెలంగాణ' చిత్రం కోసం కేసీఆర్ పాట రాశారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల కోసం రెండు రోజుల వర్క్ షాప్ ను నిర్వహించిన ఆయన, ప్రచారం కోసం దాదాపు 12 గీతాలను ఎంపిక చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి, అభివృద్ధి పథకాలు, టీఆర్ఎస్ సంక్షేమంతో పాటు, విపక్షాల కుట్రలను వివరించేలా కేసీఆర్ తన గీతాలను రచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇవి రికార్డింగ్ కు కూడా వెళ్లాయని తెలుస్తోంది. అతి త్వరలో వీటిని టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో వాడుకోనున్నారు.

ఈ వర్క్ షాప్ లో తెలంగాణ గేయ రచయితలు గోరటి వెంకన్న, జయరాజు, కాసర్ల శ్యామ్‌, సైదులు బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సులువుగా అర్థం అయ్యేలా పాటలు ఉండాలని, మళ్లీ పాడుకునేందుకు వీలుగా మనసులో నాటుకుపోవాలని కేసీఆర్ చేసిన సూచనల మేరకు గీతాలను స్వరపరచనున్నామని రచయితలు తెలిపారు.

More Telugu News