Chandrababu: చంపుదామనుకున్న వాడి జేబులో ఉత్తరం ఉండటం చంద్రబాబు పాలనలోనే చూస్తున్నాం!: కన్నా లక్ష్మీనారాయణ

  • ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి
  • ఏపీలో మానవహక్కులకు పూర్తిగా భంగం 
  • శాంతిభద్రతలను కాపాడే దమ్మూధైర్యం బాబుకు లేవు

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై దాడి కేసులో విశాఖ సీపీ లడ్డా వ్యక్తం చేసిన అంశాలపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై పూర్తి విచారణ జరగాలని కోరారు. ఆత్మహత్య చేసుకునే వాడి జేబులో ఉత్తరం ఉండటం చూశామని, చంపుదామనుకున్న వాడి జేబులో ఉత్తరం ఉండటమనేది చంద్రబాబు పాలనలోనే చూస్తున్నామని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి, వాటిని కాపాడే దమ్మూధైర్యం ముఖ్యమంత్రికి లేవని నాలుగు మాసాలుగా తాను చెబుతున్నానని అన్నారు.

ఈ రాష్ట్రంలో మానవహక్కులకు పూర్తిగా భంగం కలుగుతోందని, ప్రతిపక్ష నాయకులెవ్వరూ స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటించినప్పుడు ఆయనపైనా, తనపైనా జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా తనపై దాడికి కుట్ర జరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని అన్నారు. ఏపీలో ఏమేరకు శాంతిభద్రతలు ఉన్నాయనడానికి ఈ సంఘటనలే నిదర్శనమని, తామేమీ ఆరోపణలు చేయడం లేదని అన్నారు.

More Telugu News