CBI: ‘సీబీఐ’ కుమ్ములాటలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన.. స్వయంగా పాల్గొన్న పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ!

  • దేశవ్యాప్తంగా సీబీఐ ఆఫీసుల ముందు ధర్నా
  • వాటర్ కేనన్లు, బాష్పవాయు గోళాల ప్రయోగం
  • అలోక్ తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను సెలవుపై పంపడం పట్ల వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా అలోక్ వర్మ తొలగింపును వ్యతిరేకిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని దయాళ్ సింగ్ కళాశాల నుంచి సీబీఐ కేంద్ర ప్రధాన కార్యాలయం వరకూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

ఆందోళనల్లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను దూకి సీబీఐ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లో విచారణను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ డైరెక్టర్ గా తనను తప్పించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే కొత్తగా సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నెం నాగేశ్వరరావు ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

More Telugu News