sruthiharan: అర్జున్‌పై చేసిన లైంగిక దాడి ఆరోపణలకు కట్టుబడి ఉన్నా : శ్రుతిహరిహరన్

  • అతనికి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు
  • ఫలించని కర్ణాటక ఫిలించాంబర్‌ రాజీ యత్నాలు
  • శ్రుతిపై రూ.5 కోట్లకు పరువు నష్టం దావా

సినీ హీరో అర్జున్‌ తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించి లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఈ విషయంలో అతనికి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని నటి శ్రుతిహరిహరన్ స్పష్టం చేసింది. ‘నిబునన్‌’ సినిమా షూటింగ్‌ సందర్భంగా అర్జున్‌ తనపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడంటూ ఈ అమ్మడు చేసిన ఆరోపణలు కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శ్రుతి అబద్ధాలు చెబుతోందని కొందరు, నిజమే చెబుతోందని మరికొందరు వ్యాఖ్యానించారు.

దీంతో రంగంలోకి దిగిన కర్ణాటక ఫిలించాంబర్‌ అధ్యక్షుడు అంబరీశ్‌, ఇతర సభ్యులు గురువారం శ్రుతి‌, అర్జున్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అర్జున్‌ డిమాండ్‌ చేయగా, అందుకు శ్రుతి తిరస్కరించింది. 'నేను సరైనది అనిపించే దానికోసం ఎందాకైనా పోరాడతాను, క్షమాపణలు చెప్పను' అంటూ ఈ అమ్మడు తెగేసి చెప్పడంతో ఫిల్మ్‌చాంబర్‌ ప్రతినిధులు అవాక్కయ్యారు. కాగా, శ్రుతిపై అర్జున్‌ తరఫున ఆయన మేనల్లుడు ధృవ బెంగళూరు కోర్టులో రూ.5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

More Telugu News