ys jagan: కేంద్రం అధీనంలో ఉండే విమానాశ్రయంలోనే జగన్ పై దాడి జరిగింది: మంత్రి గంటా

  • ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు
  • ఈ దాడి వెనుక ఎవరున్నారో దర్యాప్తులో తేలుతుంది
  • దాడి తర్వాత విశాఖలోని ఆసుపత్రికి జగన్ ఎందుకు వెళ్లలేదు?

బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా వైఎస్ జగన్ పై దాడి జరగలేదని, కేంద్రం అధీనంలో ఉండే విమానాశ్రయంలోనే ఈ దాడి జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై దాడి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ఈ దాడి వెనుక ఎవరున్నారో దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేశారు. జగన్ పై దాడి జరిగిన అనంతరం విశాఖలోని ఆసుపత్రికి ఆయన ఎందుకు వెళ్లలేదో అర్థం కావడం లేదని అన్నారు.

కాగా, మరో మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వైసీపీ నేతలు తమ కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లకు కారణం కావొద్దని, ఆందోళనలు చేయొద్దని జగన్ తన పార్టీ శ్రేణులకు పిలుపు నివ్వాలని సూచించారు. విమానాశ్రయంలో రాష్ట్ర పోలీసులు ఎవరూ ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి అన్నారు.

More Telugu News