rape on married women: వివాహితను బెదిరించి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం!

  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • ఫోన్‌ సంభాషణలు బయట పెడతానంటూ బెదిరింపులు
  • చెప్పిన చోటుకు రావాలని అఘాయిత్యం

నిస్సహాయురాలైన ఓ వివాహితను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి తాను అత్యాచారం చేయడమేకాక, మరో ఇద్దరు స్నేహితులను అందుకు ఉసిగొల్పిన ప్రబుద్ధుడి తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నిజామాబాద్‌కు చెందిన ఓ వివాహిత (33) హైదరాబాద్‌లో భర్త, కొడుకుతో నివాసం ఉంటోంది. భర్త మానసిక స్థితి సరిగా లేకపోగా, కొడుకు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు.  

ఏడాది క్రితం ఈమెకు జగిత్యాలకు చెందిన నగేష్‌తో పరిచయం అయింది. తరచూ వీరు ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఆ సంభాషణలను నగేష్‌ రికార్డు చేశాడు. కొన్నాళ్ల తరువాత సదరు వివాహితను లోబర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆమె తిరస్కరించడంతో ఫోన్‌ సంభాషణలు బయట పెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. భయపడిన ఆమె మెత్తపడగానే జగిత్యాలకు రావాల్సిందిగా కోరాడు. అతను చెప్పినట్లే ఆమె ఆదివారం జగిత్యాల వెళ్లగా ఆమె బిడ్డను వేరొక వ్యక్తికి అప్పగించాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు.

అక్కడ ముగ్గురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ప్పాడ్డారు. ఆ తర్వాత ఆమెను తెచ్చి జగిత్యాల బస్టాండ్‌లో బిడ్డతోపాటు వదిలేసి వెళ్లిపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో ఆమె నిజామాబాద్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులను గుర్తించామని తెలిపారు.

More Telugu News