Harish Rao: వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడ్డా మా రైతులకు నీళ్లందిస్తాం: మంత్రి హరీశ్ రావు

  • వెయ్యిమంది కాంగ్రెసోళ్లు వత్తాసు పలికినా పట్టించుకోం
  • కచ్చితంగా కల్వకుర్తి మోటర్లు నడుపుతాం.. నీళ్లందిస్తాం
  • టీఆర్ఎస్ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడ్డా, వెయ్యిమంది కాంగ్రెసోళ్లు వత్తాసు పలికినా కచ్చితంగా కల్వకుర్తి మోటర్లు నడుపుతాం, మా రైతులకు నీళ్లందిస్తామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపివేయాలని, అది అక్రమ ప్రాజెక్టు అని చంద్రబాబు నాడు ఢిల్లీలో ఫిర్యాదు చేయడం ఏమాత్రం సబబు కాదని అన్నారు.

 వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే, టీఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశంతో టీడీపీని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుందని, తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ముసుగు కప్పుకుని నాలుగు సీట్లు సంపాదించాలని చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజలనే నమ్ముకుందని, సంక్షేమం, అభివృద్ధిలో ఈరోజున నెంబర్ వన్ స్థానంలో మన రాష్ట్రం ఉందని అన్నారు.

 నాడు కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎరువులు కావాలంటే చాంతాడంత క్యూలలో నిలబడే పరిస్థితి అని, కరెంట్ కావాలంటే ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఉండేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవని.. ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే, మళ్లీ టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించాలని కోరారు.

More Telugu News