Andhra Pradesh: తిత్లీ ఎఫెక్ట్.. ముఖ్యమంత్రి సహాయ నిధికి రాజశేఖర్ దంపతుల విరాళం!

  • ఏపీ సీఎం చంద్రబాబుకు అందజేత
  • శ్రీకాకుళం వాసులను ఆదుకోవాలని పిలుపు
  • కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుపాను తీవ్రంగా వణికించింది. కొబ్బరి, జీడి మామిడి, అరటి పంటలతో పాటు చాలా ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, బాలకృష్ణ‌, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ సహా పలువురు ఇప్పటికే సాయాన్ని ప్రకటించారు. తాజాగా హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవితలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు.

అనంతరం శ్రీకాకుళం తిత్లీ బాధితులకు రూ.10 లక్షల చెక్ ను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా రాజశేఖర్ దంపతులు కోరారు. కాగా, శ్రీకాకుళం తిత్లి బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన రాజశేఖర్ దంపతులకు ఏపీ సీఎం చంద్రబాబు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇటీవల గరుడవేగ సినిమాతో రాజశేఖర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 1983 బ్యాక్ డ్రాప్ తో సాగే ఓ చిత్రంలో నటిస్తున్నారు.

More Telugu News