Telangana: నవంబర్ తొలివారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం!: కాంగ్రెస్ నేత కుంతియా

  • మహాకూటమి కోసం త్యాగాలకు సిద్ధం
  • కేసీఆర్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లిస్తాం
  • టీఆర్ఎస్ ను ఎన్నికల్లో మట్టి కరిపిస్తాం

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను మట్టికరిపించేందుకు కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, తెలంగాణ జనసమితి(టీజేఎస్) పార్టీలు ఏకమై మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా, సీట్ల ఖరారుపై మిత్రపక్షాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే వీలైనంత త్వరగా సీట్ల వ్యవహారాన్ని తేల్చకుంటే కూటమి నుంచి బయటకువెళ్లి సొంతకుంపటి పెట్టుకుంటామని సీపీఐ, టీజేఎస్ పార్టీలు కాంగ్రెస్ కు ఈ రోజు అల్టిమేటం జారీచేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా స్పందించారు.

మహాకూటమిలో మిత్రపక్షాల కోసం సీట్ల త్యాగానికి సిద్ధంగా ఉన్నామని కుంతియా తెలిపారు. బీసీ అభ్యర్థులకు కేసీఆర్ ఇచ్చినవాటి కంటే ఎక్కువ సీట్లను ఇస్తామని వెల్లడించారు. గెలిచే అభ్యర్థుల ప్రాతిపదికగా ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో మిత్రపక్షాలతో కలిసి కేసీఆర్ ను ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక వచ్చే నెల తొలివారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కుంతియా తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు మహాకూటమి అభ్యర్థుల విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు.

More Telugu News