Uttar Pradesh: తనతో అసభ్యంగా ప్రవర్తించాడని... కొడుకును హత్య చేసిన యూపీ శాసన మండలి ఛైర్మన్ భార్య

  • మృతదేహాన్ని శవపరీక్షకు తరలించిన పోలీసులు
  • గొంతు నులిమి హత్య చేసినట్టు నిర్ధారణ 
  • తానే హత్య చేసినట్టు పేర్కొన్న మీరా యాదవ్

 ఉత్తరప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌ రమేశ్‌ యాదవ్‌ చిన్న కుమారుడు అభిజిత్‌ యాదవ్ ఆదివారం తన నివాసంలో మృతి చెందాడు. అయితే ఈ కేసు విషయంలో అనుమానించిన పోలీసులు దర్యాప్తు నిర్వహించగా విస్తుపోయే నిజం వెలుగు చూసింది. అభిజిత్‌ను అతని కన్నతల్లి మీరా యాదవ్ హత్య చేయడం సంచలనం రేపుతోంది. శనివారం రాత్రి తన కుమారుడు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో బామ్ రాశానని.. తెల్లవారి ఎంత నిద్ర లేపినా లేవలేదని అప్పటికే చనిపోయాడని మీరా యాదవ్ బంధువులకు, ఇరుగుపొరుగువారికి తెలిపారు.

అభిజిత్ మరణవార్త తెలుసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. దీంతో హడావుడిగా అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్కడి పరిస్థితిని చూసి అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. అభిజిత్‌ను గొంతు నులిమి హత్య చేసినట్టు శవపరీక్షలో తేలింది. అభిజిత్ తల్లి కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆమెను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాగిన మైకంలో తన కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో తానే హత్య చేశానని మీరా పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

More Telugu News