YSRCP: వైఎస్ రాజారెడ్డి హంతకులకు చంద్రబాబు ఆశ్రయం ఇచ్చారు!: వైసీపీ నేత భూమన ఆరోపణ

  • తుని రైలు దహనం వెనుక బాబు హస్తం
  • వంగవీటి రంగాను బాబు మట్టుబెట్టారు
  • మాజీ హోంమంత్రి హరిరామజోగయ్య దీన్ని బయటపెట్టారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ దగ్గరినుంచి అడ్డొచ్చిన ప్రతిఒక్కరినీ చంద్రబాబు అంతం చేశారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉన్నట్లు అప్పటి హోంమంత్రి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో భూమన మాట్లాడారు.

రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టే సంస్కృతికి చంద్రబాబే బీజం వేశారని భూమన అన్నారు. తన చేతుల నిండా రక్తం పూసుకుని శాంతి హోమం చేస్తున్న నయవంచకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. తునిలో రైలు దహనం వెనుక చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. ఆయన అండతో రాష్ట్రంలో రౌడీలు స్వైర విహారం చేస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి హంతకులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బాధితులు చంద్రబాబును అడుగడుగునా అడ్డుకుంటున్నారని భూమన అన్నారు. రాష్ట్రంలోని 470 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కరువును తనవెంట తెస్తారన్న భయం ప్రజల్లో నెలకొని ఉందని ఎద్దేవా చేశారు.

More Telugu News