Yamini Sadhineni: పవన్ దిగజారుడు వ్యాఖ్యలకు ఆధారాలతో కూడిన సమాధానం ఇదిగో!: టీడీపీ నేత యామిని

  • శ్రీకాకుళంలో కరెంటు సరఫరాపై పవన్ ట్వీట్లు
  • నిజం తెలుసుకుని మాట్లాడాలన్న యామిని
  • ఫేస్ బుక్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్టు

తిత్లీ బాధిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తూ, ట్విట్టర్ వేదికగా, కరెంట్ లేని విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మహిళా నేత సాధినేని యామిని స్పందించారు. ఇప్పటివరకూ కరెంటును ఎందుకు ఇవ్వలేకపోయారన్న విషయమై ఆధారాలతో సహా తాను సమాధానం ఇస్తున్నానంటూ, తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు.

ఇప్పటివరకు కరెంటు ఎందుకు ఇవ్వలేదంటూ పవన్ దిగజారుడు ట్వీట్... దానికి ఆధారాలతో సహా సమాధానం ఇదే... అంటూ ఆమె పెట్టిన పోస్టు యథాతథంగా...

"శ్రీకాకుళం తుఫానుపై రాజకీయ దాడి మొదలైంది. తుఫాను కొట్టిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్ మొత్తాన్ని పలాసకు మార్చి, అక్కడ నుంచే పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికి 7 రోజులు అయ్యింది. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే, తుఫాను ప్రభావం గురించి అంచనా వేస్తూ, తగు ఆదేశాలు ఇస్తూ, తుఫాను వచ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా, అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాక, శ్రీకాకుళంలోనే పని చేస్తూ, పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వమే ఇంత ఇదిగా పని చేస్తే, ఇక ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కాని మన ఖర్మకు ఒక నాయకుడు హైదరాబాద్ పోయాడు, ఇంకో వాడు స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతూ, కారులో కవాతులు చేసుకుంటూ, తీరిగ్గా ఆరు రోజుల తరువాత వచ్చాడు.

సరే వచ్చాడు. ఆయనకు చేతనైన సహాయం చెయ్యాలి, లేకపోతే లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో చెప్పాలి. నిన్న ఒక రెండు గంటలు తిరిగాడు, పేపర్ లో ఎదో రాసుకుని, ఈ రోజు మరో రెండు గంటలు తిరిగాడు. ఇక ట్విట్టర్ వేదికగా రాజకీయ దాడి మొదలు పెట్టాడు. ముందుగా తెలుగుదేశం పార్టీని నేనే గెలిపించా అని ట్వీట్ మొదలు పెట్టి, మీ అంతు చూస్తా అని అన్నాడు. తరువాత కరెంటు విషయంలో... ఇప్పటికి ఆరు రోజులు అయ్యింది, కరెంటు ఎందుకు రాలేదు అంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు పవన్. నిజానికి, పవన్ కళ్యాణ్ ఇక్కడ అవమానించేది చంద్రబాబుని కాదు, గ్రౌండ్ లో పని చేసే కొన్ని వేల మంది స్టాఫ్ ని.. పవన్ చౌకబారు ఆరోపణకు, ఆధారాలతో సహా నా సమాధానం ఇది.

ఇరవై-ముఫై సంవత్సరాల నుండి వేసుకున్న విద్యుత్ వ్యవస్థ మొత్తం తిత్లీ దెబ్బకు కకావికలం అయిపోయింది. 30 వేల కరెంటు స్థంబాలు పడిపోయాయి. మీరొచ్చి ఆరు రోజులైనా పునరుద్ధరించలేదని ఆరోపణలు చేస్తున్నారు. 7 వేల మంది సిబ్బంది రాత్రనకా, పగలనకా, దసరా లాంటి పెద్ద పండగలను, పెళ్ళాం బిడ్డలనొదిలేసి కష్టపడి పనిచేస్తున్నారు. మీరు తీరిగ్గా కవాతులు, బలప్రదర్శనలు పూర్తి చేసుకోని వచ్చి ఒకపూట, ఒక మూల తిరిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడతారా? ఇంటికి కరెంట్ రావాలంటే ముందు 33 కేవీ లైన్లు, తరువాత 11 కేవీ లైన్లు సరిచెయ్యాలి. ట్రాన్స్ ఫార్మర్స్, పోల్స్ కూడా పడిపోయాయి. వాటిని నిలబెట్టాలి. అప్పుడు ఎల్టీ లైన్లు సరి అవుతాయి.

అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో మీరు సినిమాలో వేసిన సెట్ లా అయిపోదు. ఇప్పటికి దాదాపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. మీ రాజకీయ ప్రచారం కోసం, కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడకండి. చేతనైతే సహాయం చెయ్యండి. లేకపోతే కవాతులు చేసుకోండి" అని యామినీ నిప్పులు చెరిగారు.

More Telugu News