kcr: సెటిలర్లు ఇంకా ఆంధ్రా వాళ్లమేనని ఎందుకు అనుకుంటున్నారు?: సీఎం కేసీఆర్

  • సెటిలర్స్ అందరికీ తాను చెప్పేదొకటే
  • తెలంగాణ వాళ్లమే అని వాళ్లు అనుకోవాలి
  • తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ మా వాళ్లే  

తెలంగాణకు ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ఆంధ్రావాళ్లు ఇంకా ఆంధ్రావాళ్లమేనని ఎందుకు అనుకుంటున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పాక్షిక మేనిఫెస్టో గురించి ముందు తెలియజేస్తున్నానని, ఆపై పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచుతామని కేసీఆర్ చెప్పారు.

అనంతరం, మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్లు ఇంకా తాము ఆంధ్రా వాళ్లమని ఎందుకనుకుంటున్నారు? అసలు ఎందుకనుకోవాలి? డెబ్బై ఏళ్ల కిందట తెలంగాణకు వచ్చిన వాళ్లు ఇంకా ఆంధ్రావాళ్లమని ఎందుకనుకోవాలి? అని ప్రశ్నించారు.

సెటిలర్స్ అందరికీ తాను చెప్పేదొకటేనని, తెలంగాణ వాళ్లమే అని అనుకోవాలని, ఆంధ్రావాళ్లమని మీ అంతట మీరే ముద్ర వేసుకోవద్దని సూచించారు. తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ మా వాళ్లే అని కొన్ని లక్షలసార్లు చెప్పానని, ఇంకా ఎన్నిసార్లు చెబుతామని అన్నారు. చంద్రబాబునాయుడు అనే ఉడుం రాకముందు గత నాలుగున్నరేళ్లలో ఈ సమస్య వచ్చిందా? తెలంగాణలో అటువంటి వాసన ఉందా? ప్రశాంతంగా, చక్కగా, ఆనందంగా, అన్నదమ్ముల్లా బతికే ప్రజల మధ్య గొడవలు పెట్టడానికా? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

More Telugu News