Geetha Bhalia: ఆత్మల భయంతో ఐదుగురు చిన్నారులతో కలసి ఆత్మయత్యా యత్నం చేసిన మహిళ.. నలుగురి మృతి!

  • ఐదుగురు చిన్నారులతో బావిలో దూకిన గీతా భాలియా
  • చిన్నారులంతా 10 ఏళ్ల లోపు వారే..
  • ఆత్మహత్యకు మరో కారణం ఆర్థిక ఇబ్బందులు

ఓ మహిళ తన ఐదుగురు చిన్నారులతో కలసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా పంచ్ పిప్లా గ్రామంలో సంచలనం సృష్టించింది. దీనికి కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు. గీతా భాలియా అనే మహిళ తనను రెండేళ్లుగా ఆత్మలు వెంటాడుతున్నాయంటూ, తన 10 ఏళ్ల లోపు చిన్నారులు ఐదుగురితో కలసి బావిలో దూకేసింది.

ఈ ఘటనలో మహిళ, పెద్ద కూతురు బ్రతకగా, మిగిలిన నలుగురూ మరణించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికి తీయించారు. మృతి చెందిన చిన్నారులలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందులు కూడా గీత ఆత్మహత్యకు మరొక కారణమని పోలీసులు వెల్లడించారు. కళ్ళు మూస్తే చాలు తనకు ఆత్మలు కనపడుతున్నాయని, ఆ బాధపడలేక చనిపోవాలనుకున్నానని, తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారన్న ఉద్దేశంతో వారిని కూడా తనతో పాటు తీసుకుపోవాలనుకున్నానని సదరు మహిళ చెప్పింది. ఆమెను అరెస్ట్ చేసి హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.

More Telugu News