man: మహిళ లైంగిక వేధింపులు భరించలేక.. ఓ వ్యక్తి ఆత్మహత్య!

  • మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో దారుణం
  • అక్రమ సంబంధాన్ని కొనసాగించాలంటూ మహిళ ఒత్తిడి
  • లేకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతానంటూ బెదిరింపు

మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. మహిళ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర పర్భాని జిల్లాలో చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సచిన్ మిత్కారి (38) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న ఓ మహిళతో సన్నిహితంగా మెలిగాడు. అతనికి అప్పటికే పెళ్లి అయింది. ఈ విషయం తెలిసి కూడా సదరు మహిళ అక్రమ సంబంధాన్ని కొనసాగించాలని అతన్ని బలవంతపెట్టింది. అందుకు అతను అంగీకరించలేదు. దీంతో, ఆమె అతన్ని వేధించడం మొదలు పెట్టింది. అక్రమ సంబంధాన్ని కొనసాగించకపోతే... లైంగిక వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది.

మహిళ వేధింపులు రోజురోజుకూ పెరగడంతో.. బాధితుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృత దేహాన్ని చూసిన ఇరుగుపొరుగు వారు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.

ఈ సందర్భంగా సచిన్ జేబులో ఉన్న ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. మహిళ లైంగిక వేధింపులను భరించలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, లేఖ ఆధారంగా దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.  

More Telugu News