Team India: టీమిండియాకు కాంగ్రెస్ కంగ్రాట్స్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

  • టెస్టు సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న టీమిండియా
  • అభినందనలు చెబుతూ కాంగ్రెస్ ట్వీట్
  • దృష్టి లోపం వచ్చిందన్న నెటిజన్లు

టీమిండియా టెస్టు జట్టును ‘మెన్ ఇన్ బ్లూ’గా పేర్కొన్న కాంగ్రెస్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విండీస్‌తో జరిగిన రెండు టెస్టులను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ స్వదేశంలో వరుసగా పది టెస్టు సిరీస్‌లను గెలుచుకుని రికార్డులకెక్కింది. అరుదైన ఘనత సాధించిన కోహ్లీ సేనపై అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు. భారత్ విజయంపై స్పందించిన కాంగ్రెస్ కూడా జట్టును ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. సరిగ్గా ఇప్పుడా ట్వీటే ట్రోలింగ్‌కు కారణమైంది.

‘‘వెస్టిండీస్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న మెన్ ఇన్ బ్లూకు అభినందనలు’’ అని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు చెలరేగిపోయారు. కాంగ్రెస్‌ను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి భారత వన్డే జట్టును మాత్రమే ‘మెన్ ఇన్ బ్లూ’గా పిలుస్తారు. టెస్టుల్లో భారత జట్టు తెలుపు జెర్సీలనే ధరించి బరిలోకి దిగుతుంది. ఇంత చిన్న విషయం కూడా కాంగ్రెస్‌కు తెలియకపోయిందంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

కాంగ్రెస్ అర్జెంటుగా కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన సమయం వచ్చిందని, కాంగ్రెస్ ఐటీ విభాగానికి తెలుపు జెర్సీ కూడా నీలం రంగులో కనిపిస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే, కాంగ్రెస్ దృష్టి లోపానికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని పిలుపునిచ్చాడు.

More Telugu News