Bangaluru: తరగతి గదిలో విద్యార్థుల ఎదుటే ప్రిన్సిపాల్‌ను నరికి చంపిన దుండగులు!

  • విద్యార్థులకు పాఠం చెబుతుండగా ఘటన
  • మారణాయుధాలతో క్లాస్‌లోకి ప్రవేశించిన దండగులు
  • షాక్‌లో విద్యార్థులు

విద్యార్థులకు స్పెషల్ క్లాస్ చెబుతున్న ఓ ప్రిన్సిపాల్‌ను కొందరు దుండగులు అత్యంత దారుణంగా పొడిచి చంపారు. బెంగళూరులో జరిగిందీ ఘటన. తమ కళ్లముందే ప్రిన్సిపాల్‌ను చంపడంతో విద్యార్థులు వణికిపోయారు. షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. నగరంలోని అగ్రహార దసహళ్లి‌లోని హవనూర్ పబ్లిక్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపాల్ రంగనాథ్ (60) విద్యార్థులకు ప్రత్యేక క్లాస్ చెబుతుండగా మారణాయుధాలతో పాఠశాలలోకి ప్రవేశించిన ఆరుగురు దండగులు నరికి చంపారు. అనంతరం కారులో పరారయ్యారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతంలో ఓ నిందితుడు చిక్కాడు. అంతకుముందు పోలీసులకు-నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ తూటా నిందితుడి కాలులోకి దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. స్కూలు భవనం కట్టిన భూమి విషయంలో వివాదమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News