Uttam Kumar Reddy: ఆయన 'గడ్డం కుమార్ రెడ్డి'గానే ఉండాల్సి వస్తుంది: నాయిని సెటైర్లు

  • ఇకపై ఉత్తమ్ ఎప్పటికీ గడ్డంతోనే ఉంటాడు
  • తెలంగాణ పోలీసులపై ఉత్తమ్ ఆరోపణలు తగదు
  • త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం 

టీ-పీీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొచ్చే వరకూ తన గడ్డం తీసే ప్రసక్తే లేదని ఉత్తమ్ నాడు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు విసిరారు. ఇకపై ఉత్తమ్ ఎప్పటికీ గడ్డంతోనే ఉంటాడని, ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు.. ‘గడ్డం కుమార్ రెడ్డి’ అని వ్యంగ్యంగా అన్నారు.  

తెలంగాణ పోలీసులపై లేనిపోని ఆరోపణలు ఉత్తమ్ చేస్తున్నారని, దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ పోలీస్ అని కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పోలీసులు వాళ్ల పని వారు చేసుకుపోతున్నారని, అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయొద్దని ఉత్తమ్ కు హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక, అధికారుల పని పడతామని ఉత్తమ్ అంటున్నారని, వాళ్లను బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని.. అది సాధ్యమయ్యే పని కాదని హెచ్చరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని, ప్రజలకు కేసీఆర్ అందించిన పాలన, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.  

More Telugu News