Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో ఎన్నికల ర్యాలీలో బాంబు పేలుడు.. 12 మంది మృతి

  • నజీఫా‌కి మద్దతుగా జరుగుతున్న ర్యాలీలో పేలిన బాంబు
  • సురక్షితంగా బయటపడిన నజీఫా
  • గతంలో 9 మంది అభ్యర్థుల హత్య

ఓ ఎన్నికల ర్యాలీలో ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలడంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా... 32 మంది గాయాల పాలయ్యారు. ఆఫ్ఘానిస్తాన్‌లోని తకార్‌ ప్రావిన్స్‌లో పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నజీఫా యూసెఫిబెక్‌ ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగిందని ప్రావెన్షియల్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి మహమ్మద్‌ జవాద్‌ హేజ్రీ తెలిపారు.

నజీఫాకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలో మోటార్‌ సైకిల్‌లో అమర్చిన బాంబు పేలిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం నుంచి నజీఫా సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఎన్నికల్లో నిలబడ్డ 9 మంది అభ్యర్థులు హత్యకు గురయ్యారు. దీంతో అఫ్ఘానిస్తాన్‌లో పార్లమెంటరీ ఎన్నికలు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే మోటార్‌సైకిల్‌ దాడికి పాల్పడింది ఎవరనే అంశం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News