Tamil Nadu: ఈ పాస్టర్ మామూలోడు కాదు.. 30 మందిని పెళ్లాడాడు.. పలువురిపై అత్యాచారం చేశాడు!

  • మత ప్రచారం ముసుగులో పెళ్లిళ్లు, అత్యాచారాలు
  • హత్య చేసిన ఒకరిని అడ్డుతొలగించుకున్న వైనం
  • మేకల దొంగతనం కేసులో పట్టుబడి జైలుకు

మత ప్రచారం ముసుగులో ఓ పాస్టర్ చేసిన దారుణాలు వెలుగుచూసి సంచలనం సృష్టిస్తున్నాయి. ఏకంగా 30 పెళ్లిళ్లు చేసుకున్న ఆ ప్రబుద్ధుడు మరెందరో మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఓ మహిళను హత్య చేశాడు. చివరికి ఓ మేకల దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పాపాల చిట్టా బయటపడింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ఉక్కిరన్‌ కోటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

మిలన్ సింగ్ (48) అనే పాస్టర్ సైకిలుపై ఊరూరా తిరుగుతూ మత ప్రచారం నిర్వహిస్తున్నాడు. అత్త కుమార్తె డైసీని పెళ్లాడిన మిలన్ మనస్పర్థల కారణంగా ఆ తర్వాత కొన్నాళ్లకు విడిపోయారు. ఆ తర్వాత సలోమీ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగక ఆమె చెల్లెలు జెన్నిఫర్ రాణిని మూడో పెళ్లి చేసుకున్నాడు. అటు తర్వాత తన వద్దకు బైబిలు పాఠాలు నేర్చుకునేందుకు వచ్చిన జీవిత అనే అమ్మాయిని మోసగించి పెళ్లాడాడు.

ఆమెతో కలిసి గ్రామాల్లో మత ప్రచారం నిర్వహిస్తూ ఆ ముసుగులో పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అనంతరం వారిలోనే కొందరిని పెళ్లాడాడు. ఇలా ఇప్పటి వరకు 30 మందిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఓ మహిళను హత్య చేశాడు. ఇటీవల జరిగిన ఓ మేకల దొంగతనం కేసులో మిలన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో అతడు చెబుతున్న విషయాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. 

More Telugu News