bahrani: బహ్రెయిన్ లో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు ఆరా

  • ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలుడు
  • పేలుడు ధాటికి భవనం నేలమట్టం  
  • నలుగురు మృతి..ఇరవై మందికి పైగా గాయాలు

బహ్రెయిన్ దేశంలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా, సుమారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు. ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలి ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది. ఈ సమాచారం మేరకు సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించాయి. భవన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోననే అనుమానంతో తక్షణ చర్యలు ప్రారంభించాయి.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. మృతుల్లో తెలుగువారు ఉన్నారంటూ వెలువడుతున్న మీడియా కథనాల నేపథ్యంలో ఏపీ భవన్ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు.  ఈ విషయమై బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించానని, మృతులందరూ బంగ్లాదేశ్ కు చెందిన వారేనని రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఒకవేళ తెలుగువారు బాధితులుగా ఉంటే వెంటనే వారిని ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

More Telugu News