Khammam District: కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న వివాహిత.. చికిత్స పొందుతూ మృతి!

  • భర్త ప్రవర్తనతో విసిగిపోయి నిర్ణయం
  • కోపోద్రిక్తులైన బంధువులు
  • మృతదేహంతో భర్త ఇంటి ముందు ఆందోళన

జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్త మరో మహిళతో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఆమె తట్టుకోలేకపోయింది. పైగా ప్రశ్నించినందుకు వేధింపులు కూడా అధికం కావడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఈ పరిస్థితుల్లో తనువు చాలించడమే మేలనుకుని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు మృతదేహంతో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...తల్లాడ మండలం గొల్లగూడేనికి చెందిన రజీనీకి, ఇదే మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అనగాని రంజిత్‌కుమార్‌తో పదకొండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు.  ఇటీవల కొంతకాలంగా రంజిత్‌కుమార్‌ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు.

దీనిపై ప్రశ్నిస్తున్న భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అతని తల్లి కూడా ఇందుకు సహకరిస్తుండడంతో రజనీ భరించలేక పోయింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఇటీవల  తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తలో మార్పు వచ్చే పరిస్థితి కనిపించక పోవడంతో ఈనెల 3వ తేదీన ఆత్మహత్యా యత్నం చేసింది. రజని తండ్రి గుండ్ల చిననరసింహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News