NTR Biopic: నేను శ్రీదేవి అభిమానిని...ఆమె పాత్రే పోషిస్తుండడం ఆనందంగా ఉంది : రకుల్‌ప్రీత్‌ సింగ్‌

  • ఎన్టీఆర్‌ బయోపిక్‌లో లెజెండ్‌ పాత్ర పోషిస్తున్న రకుల్‌
  • ఇది చాలా సవాల్‌తో కూడుకున్నది
  • న్యాయం చేయగలననే నమ్ముతున్నాను

‘కోట్లాది భారతీయ అభిమానుల్ని సొంతం చేసుకున్న లెజెండ్‌ శ్రీదేవికి నేనూ ఒక అభిమానిని. అటువంటి నేను ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఆమె పాత్రే పోషిస్తుండడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. చాలా సవాల్‌తో కూడిన ఈ పాత్రకు న్యాయం చేయగలననే నమ్ముతున్నాను’ అని ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అంది. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ రెండు భాగాల చిత్రంలో మొదటి భాగానికి ‘కథా నాయకుడు’, రెండో భాగానికి ‘మహా నాయకుడు’ అన్న పేర్లు ఖరారు చేశారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో సినిమాల్లో నటించిన శ్రీదేవి పాత్రను రకుల్‌ పోషిస్తోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'నేనెప్పుడూ శ్రీదేవిని కలవ లేదు. అందుకే నిర్మాతల సూచన మేరకు ఆమె చిత్రాలు కొన్ని చూస్తున్నాను. ఆమె గురించి తెలిసిన వారిని కలుస్తున్నాను. ఓ గొప్ప నటి పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అదే సమయంలో అందరి కళ్లు నా మీదే ఉంటాయి కాబట్టి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా తెలుసు' అని మురిసిపోయింది ఈ ముద్దుగుమ్మ.

వంద శాతం శ్రీదేవి పాత్రకు న్యాయం చేయగలననే నమ్ముతున్నట్లు తెలిపింది. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తుండగా విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, నిత్యామీనన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా దివిసీమలో  చిత్రం తాలూకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

More Telugu News