auto: శునకాన్ని తొక్కించిన ఆటో.. డ్రైవర్ వెంటపడి మరీ నరికిన యజమాని!

  • దేశ రాజధానిలో ఘటన
  • పొరపాటున కుక్కను తొక్కించిన డ్రైవర్ రాణా
  • కత్తిదాడితో ఆసుపత్రిలో చికిత్స

పెంపుడు జంతువులను అందరూ ఒకేలా తీసుకోరు. కొందరు వ్యక్తులు ఓ దశ వరకూ వాటితో అనుబంధం పెంచుకుంటే.. మరికొందరు మాత్రం తమ కుటుంబంలో సభ్యుడిగా పరిగణిస్తారు. వాటికి ఏమైనా జరిగితే తట్టుకోలేరు. తాజాగా తమ పెంపుడు కుక్కను ఓ ఆటో ఢీకొట్టి, తొక్కి చంపడంతో ఓ యజమాని ఆగ్రహోద్రుడయ్యాడు. ఆటో డ్రైవర్ ను వెంటపడి మరీ నరికాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీకి చెందిన విజేంద్ర రాణా ఆటోను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆటో నడుపుతుండగా, ఓ శునకం ఎదురుగా వచ్చింది. వాహనాన్ని అదుపు చేయలేకపోయిన రాణా దానిపైకి ఎక్కించేశాడు. దీంతో సదరు కుక్క యజమాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఓ కత్తి తీసుకుని రాణాతో పాటు ఆటోలో ఉన్న అతని సోదరుడి వెంట పడ్డాడు. చివరికి ఆటోను ఆపి మరీ వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అన్నదమ్ములను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News