Punjab: రూ.60 లక్షల పన్ను కట్టిన పకోడీ వ్యాపారి.. దాడి చేస్తే బయటపడిన దొంగ లెక్కలు!

  • భారీగా పన్ను ఎగ్గొడుతూ వస్తున్న పకోడీ వ్యాపారి
  • దాడి చేసి గుట్టు రాబట్టిన ఐటీ
  • రూ.60 లక్షలు కట్టించుకున్న వైనం

ఓ పకోడీ వ్యాపారి ఏకంగా రూ.60 లక్షల పన్ను చెల్లించడం చర్చనీయాంశమైంది. వీధిలో చిన్న కొట్టుగా ప్రారంభమై కోట్లకు పడగలెత్తిన వ్యాపారి.. అతి తక్కువ పన్ను చెల్లిస్తుండడంతో అనుమానం వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తే అసలు విషయం బయటపడింది. దొంగ రికార్డులతో పన్నును భారీగా ఎగ్గొడుతున్నట్టు తేలింది. దీంతో అతడి నుంచి భారీగా పన్ను కట్టించుకున్నారు.

పంజాబ్‌లోని లుథియానాలో జరిగిందీ ఘటన. పన్నా సింగ్ అనే వ్యక్తి 1952లో వీధిలో చిన్న పకోడీ కొట్టు పెట్టాడు. అది క్రమంగా పెరిగి పెద్ద వ్యాపారంగా మారింది. రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు అతడి కస్టమర్లుగా మారిపోయారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పన్నా సింగ్ ఆదాయపు పన్ను మాత్రం అతి తక్కువగా చెల్లిస్తుండడంతో అనుమానం వచ్చిన అధికారులు దాడి చేసి రికార్డులు పరిశీలించారు. దీంతో పన్నాసింగ్ పన్నును భారీగా ఎగ్గొడుతున్నట్టు తేలింది. దీంతో అతడితో అప్పటికప్పుడు రూ.60 లక్షలు పన్ను కట్టించారు. లుథియానాలోనే ఓ డ్రైఫ్రూట్స్ వ్యాపారి ఇంటిపైనా దాడిచేసిన ఐటీ అధికారులు అతడితో ఏకంగా కోటి రూపాయల పన్ను కట్టించారు.

More Telugu News