Telangana: అవును, ఈ బచ్చాగాళ్లే తెలంగాణ తెచ్చారు.. నువ్వేమో కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నావ్!: ఉత్తమ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్

  • కాంగ్రెస్ నేతలకు బలుపు ఎక్కువ
  • ఉద్యమం సమయంలో ఇళ్లలో దాక్కున్నారు
  • 100కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని ధీమా

కాంగ్రెస్ పార్టీ నాయకులకు బలుపు ఎక్కువని టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ యువత వీర సైనికుల్లాగా ఉద్యమిస్తుంటే.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లను పట్టుకున్న వ్యక్తి ఉత్తమ్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని ఛోటామోటా నాయకులందరూ చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు టీఆర్‌ఎస్‌వీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.

తాను గట్టిగా మాట్లాడితే బచ్చా అని అంటున్నారనీ, కాంగ్రెస్ దద్దమ్మలు ఇంట్లో దాక్కుంటే ఈ బచ్చాగాళ్లే ప్రత్యేక తెలంగాణను తెచ్చారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సైనికుడే కాదనీ, ఆయన ఓ బంట్రోతు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థులంతా కాంగ్రెస్ పార్టీ కి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి, తెలంగాణ ప్రజల పౌరుషానికి మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రగతి భవన్ కోట గడులు పగులగొడతామన్న కోదండరాం.. ఇప్పుడు గోడలు గీస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యే సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News