Mamata Banerjee: మమతా బెనర్జీకి భారీ షాకిచ్చిన కలకత్తా హైకోర్టు!

  • దుర్గా పూజా కమిటీలకు రూ.28 కోట్లు ఇవ్వాలని మమత నిర్ణయం
  • హైకోర్టులో సవాలు చేసిన న్యాయవాది
  • స్టే విధించిన కోర్టు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు షాకిచ్చింది. దుర్గా పూజ కోసం 28 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న నిర్ణయంపై కోర్టు స్టే విధించింది. కోల్‌కతాలోని మొత్తం 3 వేల పూజా కమిటీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల కమిటీలకు రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు సీఎం మమత గత నెలలో ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సవాలు చేస్తూ సురభ్ దత్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవాశిష్ కర్ గుప్తా, జస్టిస్ షంపా సర్కార్‌తో కూడిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది.

దుర్గా పూజ ఉత్సవాలకు ఏ ప్రాతిపదికన డబ్బులు పంపిణీ చేయబోతున్నారని ప్రశ్నించింది. ఈ విషయంలో ఏవైనా గైడ్ లైన్స్ పాటిస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డబ్బులు కేవలం దుర్గా పూజకే పంపిణీ చేస్తున్నారా? లేక ఇతర పండుగలకు కూడా ఇస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని చెబుతూనే ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటున్నారని నిలదీసింది. డబ్బులు తీసుకున్న కమిటీలు దానిని దుర్వినియోగం చేస్తే ఎటువంటి చర్యలు చేపడతారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

హైకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. హైకోర్టు నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్వాగతించారు. ఇలాంటి నిర్ణయాలతో మమతా బెనర్జీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

More Telugu News