TRS: టీఆర్ఎస్ నేత నందకిశోర్ వ్యాస్ కుమారుడిపై హత్యాయత్నం... పరిస్థితి విషమం!

  • స్నేహితుల మధ్య వాగ్వాదం  
  • అబిడ్స్ ప్రాంతానికి వెళ్లిన వేదవ్యాస్, అమిత్ వ్యాస్
  • దాడికి పాల్పడిన ఇద్దరు యువకులు

హైదరాబాద్ నగర తెలంగాణ రాష్ట్ర సమితి నేత, గోషామహల్ నుంచి అసెంబ్లీ సీటును ఆశిస్తున్న నంద కిశోర్ వ్యాస్ కుమారుడు ప్రేమవ్యాస్ పై హత్యాయత్నం జరిగింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం మేరకు, నందకిశోర్ సోదరుడి తనయుడు అమిత్ వ్యాస్ తో కలసి ప్రేమ్ వ్యాస్ తమ హోటల్ లో ఉన్న వేళ, ఆకాష్ సోలంకి అనే మిత్రుడు ఫోన్ చేసి దుర్భాషలాడటంతో గొడవ మొదలైంది.

 మాటా మాటా పెరిగి, ఎక్కడున్నావంటే ఎక్కడున్నావంటూ, దమ్ముంటే రావాలంటూ సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో అబిడ్స్ సంతోష్ దాబా వద్దకు అమిత్, ప్రేమ్ వ్యాస్ లు మరో ఇద్దరు స్నేహితులతో కలసి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆకాశ్ సోలంకి, దీపక్ వ్యాస్ అనే యువకులు కత్తులతో దాడి చేశారు.

తీవ్ర గాయాల పాలైన వీరిని పోలీసులు ఉస్మానియాకు తరలించగా, విషయం తెలుసుకున్న నంద కిశోర్ అనుచరులు, వారిని బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ్ వ్యాస్ కు 10 చోట్ల, అమిత్ వ్యాస్ కు 18 చోట్ల గాయాలు అయ్యాయని, వీరిద్దరి పరిస్థితి విషమంగా వుందని సమాచారం. వారితో పాటు ఉన్న మిగతా ఇద్దరికీ స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇది రాజకీయ దాడా? లేక యువకుల మధ్య గొడవల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More Telugu News