Panchayat: వేరే కులం అబ్బాయితో పారిపోయేందుకు యత్నించిందని.. యువతిని చెట్టుకు కట్టేసి చావబాదిన గ్రామస్థులు!

  • గ్రామం పరువు తీసిందంటూ యువతిపై దాడి
  • చెట్టుకు కట్టేసి ఐదు గంటలపాటు చిత్రహింసలు
  • బీహార్‌లో ఘటన

ఇతర కులం అబ్బాయిని ప్రేమించి అతడితో కలిసి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన యువతిపై గ్రామస్థులు దాడి చేశారు. ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. బీహార్‌లోని జోగియా మారన్ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన ఓ యువతి వేరే కులం అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని భావించిన యువతి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అతడితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించింది.

దీనిని గమనించిన గ్రామస్థులు ఆమెను పట్టుకుని పంచాయతీ నిర్వహించారు. ఆమెను చెట్టుకు కట్టేసి చావబాదారు. వేరే కులం యువకుడితో వెళ్లేందుకు ప్రయత్నించి గ్రామం పరువు తీసిందని ఆరోపించారు. చెట్టుకు కట్టేసి ఐదు గంటల పాటు హింసించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్పృహ కోల్పోయిన యువతిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News