paruvu hatya: మహారాష్ట్రలో ఘోరం.. ‘పరువు’ తీసిందని కూతురుకి మత్తుమందిచ్చి ఆపై హత్య!

  • మహారాష్ట్రలోని మాలేగాం పట్టణంలో ఘటన
  • బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుండగా తెలుసుకున్న తల్లిదండ్రులు
  • ఇతర కులం అబ్బాయని తెలిసి అమానుషం

బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు చెట్టాపట్టాలేసుకు తిరగడంతో  తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. పైగా తమ కూతురు చెయ్యి పట్టుకుని తిరుగుతున్నది మరో కులస్తుడని తెలియడంతో 'పరువు' పోయిందని ఆగ్రహంతో ఊగిపోయారు. అంతే, ఇంటికి వచ్చిన కూతురికి మత్తు మందు కలిపిన ఆహారం తినిపించారు. అనంతరం హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని పూడ్చేశారు. మహారాష్ట్రలోని మాలేగాం పట్టణంలో జరిగిన ఈ దారుణం పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే... మాలేగాం పట్టణంలోని ఇంద్రాణి కాలనీకి చెందిన నేహా చౌదరి (18) పన్నెండవ తరగతి చదువుతోంది. తన జన్మదినోత్సవం సందర్భంగా బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి పట్టణ శివారు ప్రాంతానికి వెళ్లింది. కులంకాని వాడితో తిరిగి కుటుంబం ‘పరువు’ తీస్తోందని ఆగ్రహంతో ఊగిపోయారు. జన్మదిన వేడుకల నుంచి వచ్చిన నేహాపై ఆమె తల్లిదండ్రులు శరద్‌, సుమిత, వారి సమీప బంధువు నీలేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం కుమార్తెకు నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని పెట్టారు. నిద్రలో ఉండగానే నేహాను చంపేసి శ్మశానానికి తరలించి పూడ్చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి పూడ్చి పెట్టిన శవాన్ని వెలికి తీయించి స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో నేహాది హత్యని తేలడంతో నేహా తల్లిదండ్రులు, ఆమె బంధువును విచారించారు. విచారణలో ఇతర కులం యువకుడిని ప్రేమించి తప్పు చేయడంతో తామే హత్య చేశామని వారు అంగీకరించారు. దీంతో హత్య కేసు నమోదు చేసి నేహా తల్లిదండ్రులు శరద్‌, సుమితా, వారి సమీప బంధువు నీలేష్‌ను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News