Telangana: కేసీఆర్ విదిల్చే ఎంగిలి మెతుకులు మాకెందుకు?: 'అడుక్కుంటే నాలుగు సీట్లు పారేస్తా'నన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఎల్ రమణ

  • అధికారంలోకి వచ్చేది మహాకూటమే
  • ఓటమి భయంతోనే కేసీఆర్ నోటివెంట బూతులు
  • చంద్రబాబు వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రమైందన్న ఎల్ రమణ

కేసీఆర్ విదిల్చే ఎంగిలి మెతుకులు తమకు అవసరం లేదని, ప్రజల మద్దతుతో అధికారంలోకి మహాకూటమి రానుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసేబదులు తనను అడుక్కుంటే నాలుగు సీట్లు పారేసేవాడినన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఈ ఉదయం స్పందించిన ఎల్ రమణ, కేసీఆర్ కు లాగానే తామూ తీవ్ర పదజాలాన్ని వాడగలమని, తాము తిడితే కేసీఆర్ తట్టుకోలేడని అన్నారు.

కొంగర కలాన్ సభ విఫలం కావడంతో డీలా పడిన ఆయన, ఓటమి భయంతో మరోసారి బూతులు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగిన ఆయన, మహాకూటమి అధికారంలోకి వస్తే, కేసీఆర్, ఆయన కుటుంబం, ప్రభుత్వం జరిపిన అవినీతి బయట పడుతుందన్న భయం పట్టుకుందని అన్నారు. నరేంద్ర మోదీతో కలసి కాంగ్రెస్, టీడీపీలను అణచేందుకు చేస్తున్న కుట్రలు ఫలించవని అన్నారు. చంద్రబాబు వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందన్న విషయాన్ని కేసీఆర్ మరువరాదని హితవు పలికారు.

More Telugu News