Ashok Gajapatiraju: బాబాయి పార్టీ బాబాయిదే, నా పార్టీ నాదే: బీజేపీలో చేరిన ఆనంద గజపతి రాజు కుమార్తె సంచిత

  • చేతనైనంతలో ప్రజాసేవ చేస్తాను
  • మోదీ కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలినై బీజేపీలో చేరాను
  • హోదా, జోన్ అంశాలను రాజకీయం చేయొద్దు: సంచిత

తనకు చేతనైనంతలో ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో, నరేంద్ర మోదీ చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలినై బీజేపీలో చేరానని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆమె, బాబాయి పార్టీ బాబాయిదేనని, తన పార్టీ తనదేనని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, బీజేపీలు సిద్ధాంతాల పరంగా విభేదించినప్పటికీ, రెండు పార్టీలూ ప్రజలకు మంచి పాలననే అందిస్తున్నాయని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వే జోన్ అంశాలను రాజకీయం చేయడం తగదని అన్నారు. ప్రజలందరికీ తాగునీరు, శానిటేషన్ సదుపాయాలు దగ్గర చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు తాను అడుగులు వేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా తన రాజకీయాలు ఉంటాయని, బీజేపీ స్వచ్ఛ భారత్ ను చేపట్టిన విధానం, ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు చేసిన కృషిని చూసి, ఆ పార్టీ వైపు ఆకర్షితురాలినయ్యానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు విస్తృతంగా సేవ చేయవచ్చని చెప్పారు.

More Telugu News