Andhra Pradesh: దేశంలో ఏపీ నంబర్‌ వన్‌ కావాలి...శ్రద్ధపెడితే అసాధ్యమేమీ కాదు : సీఎం చంద్రబాబు

  • గ్రామ దర్శినిపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌
  • అధికార యంత్రాంగం తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం
  • ప్రభుత్వంపై విశ్వాసాన్ని బట్టే ప్రజల్లో సంతృప్తి ఉంటుందని సూచన

ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో ముందుండేలా నడిపించి దేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుందని చెప్పారు. స్వచ్ఛ భారత్‌లో మన రాష్ట్రం దేశంలో ఐదో స్థానంలో ఉంటే దక్షిణాదిలో మనమే నంబర్‌ వన్‌ అని, ఇలా అన్ని రంగాల్లో ఇటువంటి ఫలితాలు సాధ్యమైతే ఏపీ నంబర్‌ వన్‌ కావడం అసాధ్యమేమీ కాదని చెప్పారు.

‘గ్రామ(నగర)దర్శిని’ కార్యక్రమంపై బుధవారం సీఎం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తూతూ మంత్రంగా పనిచేస్తే ఫలితాలు రావన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. గ్రామ, నగర దర్శిని కార్యక్రమాలకు ప్రతి అధికారి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని, గ్రామాభివృద్ధి ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని బట్టే ప్రజల్లో సంతృప్తి నెలకొంటుందన్న విషయం గమనించాలన్నారు.

More Telugu News