Vemulawada: ప్రేమ ఫలించే అవకాశం లేదని... దేవుడి సన్నిధిలో ప్రేమజంట ఆత్మహత్య!

  • వేములవాడలో ఘటన
  • భర్తతో విడిపోయిన తరువాత కనిపించిన పాత ప్రియుడు
  • పెద్దలను ఎదిరించలేమన్న భావనతో ఆత్మహత్య

పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్న ఓ జంట, ఇక తమ ప్రేమ ఫలించే అవకాశం లేదన్న భావనతో వేములవాడ రాజరాజేశ్వరీ సన్నిధికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బెల్లంపల్లి మండలం లింగాపూర్‌ కు చెందిన సింగతి విష్ణువర్ధన్‌ (26), బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన రాచర్ల మౌనిక (26)లకు చాలా సంవత్సరాల నుంచే పరిచయం ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని కలిసుండాలని భావిస్తే, దైవం మరోలా భావించింది. మౌనికకు మరో యువకుడితో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇటీవల భర్తతో విభేదాలు రావడంతో మౌనిక పుట్టింటికి రాగా, చిన్ననాటి ప్రేమికుడు మరోసారి కనిపించాడు.

ఇప్పటికైనా కలిసుండాలంటే, పెద్దలను ఎదిరించాల్సి వస్తుందని, ఆ పని తమ వల్ల కాదని భావించి, వేములవాడకు వచ్చారు. దైవదర్శనానికి వచ్చామని చెబుతూ, ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి వచ్చిన వారు, నిన్న ఎంతసేపటికీ గది దాటి బయటకు రాలేదు. దీంతో లాడ్జి నిర్వాహకులు తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, గదిలో తనిఖీ చేయగా, మొత్తం విషయాన్ని బయటపెడుతూ సూసైడ్ నోట్ లభించింది. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

More Telugu News