Chandrababu: చంద్రబాబు, జగన్, పవన్.. అందరిళ్లకు వెళ్లి ప్రచారం చేస్తాం!: రఘువీరారెడ్డి

  • రేపటి నుంచి ‘ఇంటింటా కాంగ్రెస్’ ప్రారంభిస్తున్నాం
  • అన్ని పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేస్తాం
  • 2019లో  కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఉంది

దేశంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. 2019  ఎన్నికల ప్రీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ‘ఇంటింటా కాంగ్రెస్’ ప్రచారం కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, శ్రీకాకుళం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. ఈ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, వైసీపీ, జనసేన .. అన్ని పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ నివాసాలతో పాటు కమ్యూనిస్టు నేతల ఇళ్లకు కూడా వెళతామని, ఏ ఇంటినీ విడిచిపెట్టకుండా ప్రచారం చేస్తామని అన్నారు.

చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ నివాసాలకు తాము వెళతామని, ఆ సమయంలో వాళ్ల ఇళ్లలో ఎవరుంటే వారిని కలుస్తామని, కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరతామని అన్నారు. 2019లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ మోసం చేసిందని, ఆ హోదాను ప్రాంతీయ పార్టీలు తేలేవని అన్నారు. రేపటి నుంచి నెలఖారు వరకు ‘ఇంటింటా కాంగ్రెస్’ జరుగుతుందని, ప్రతిఒక్కరిని ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ దేశం, రాష్ట్రం బాగుపడటం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజెప్పే ప్రయత్నమే ‘ఇంటింటా కాంగ్రెస్’ అన్నారు.

More Telugu News