Rafel: నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి : రక్షణ మంత్రిపై చిదంబరం ట్వీట్ల వర్షం

  • తమకేమీ దక్కలేదనే కాంగ్రెస్‌ అక్కసు అన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందన
  • వరుస ట్వీట్లతో మూడు ప్రశ్నలు సంధించిన మాజీ మంత్రి
  • ఎన్‌డీఏ ప్రభుత్వం సచ్చీలత నిరూపించుకోవాలని వ్యాఖ్య

రాఫెల్‌ ఒప్పందంపై ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రాఫెల్‌ డీల్‌పై కాంగ్రెస్‌ పార్టీ రాద్ధాంతం చేయడం వెనుక అసలు కారణం ఆ ఒప్పందం ద్వారా తామేమీ పొందలేకపోయామన్న నిరాశేనని మంత్రి వ్యాఖ్యానించారు. పైగా యూపీఏ ప్రభుత్వం హయాంలో సంప్రదింపులన్నీ బ్రోకర్లతోనే జరిగేవని, బ్రోకర్ల అవసరం లేకుండా సంప్రదింపుల ద్వారా ప్రభుత్వాల మధ్యనే ఒప్పందాలు సాధ్యమని ఎన్‌డీఏ నిరూపించిందని సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం తీవ్రంగా స్పందించారు.

వరుసగా మూడు ట్వీట్లు పెట్టి మూడు ప్రశ్నలను సంధించారు. 126 యుద్ధ విమానాల కొనుగోలుకు యూపీఏ ప్రభుత్వం దాదాపుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రధాని మోదీ ఎందుకు రద్దు చేశారని ఆయన తొలి ప్రశ్న వేశారు. కొత్త ఒప్పందంలో ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌ (హాల్‌) పేరును ఎందుకు సూచించలేకపోయింది? అని ప్రశ్నించారు. సంప్రదింపులు జరపడం ద్వారా రాఫెల్‌ విమానాలను 9 శాతం తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు చెబుతున్న బీజేపీ ప్రభుత్వం  ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం 126 జెట్లకు బదులు 36 విమానాలే ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి బీజేపీ ప్రభుత్వం తమ సచ్చీలత నిరూపించుకోవాలని కోరారు.

More Telugu News