Andhra Pradesh: పవన్ కల్యాణ్‌కు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం: ఏపీ డీజీపీ

  • పవన్ కల్యాణ్ రక్షణ బాధ్యత మాదే
  • పవన్ ఆ ముగ్గురి వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటాం
  • ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాం

తన హత్యకు పథకం పన్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. ఏపీలోని ఐదు కోట్ల మందికీ తాము రక్షణగా ఉంటామని, పవన్ రక్షణ బాధ్యత కూడా తమదేనని స్పష్టం చేశారు. తన హత్యకు కుట్రపన్నారని చెబుతున్న ఆ ముగ్గురి వ్యక్తుల పేర్లను పవన్ తమకు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదని ఠాకూర్ తేల్చి చెప్పారు. పవన్ ఆరోపణలపై ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి సమాచారం అందించినట్టు చెప్పారు. పవన్ వద్ద ఆధారాలు తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్టు ఆయన వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తాము అండగా ఉంటామని, ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తమను సంప్రదించాలని డీజీపీ కోరారు.

More Telugu News