Rajnath Singh: రెండు రోజుల క్రితమే అది జరిగింది.. కానీ అదేంటో చెప్పలేను!: 'సర్జికల్ స్ట్రయిక్'పై రాజ్‌నాథ్ సింగ్

  • పాకిస్థాన్‌పై మరోమారు మెరుపుదాడులు
  • పరోక్షంగా వెల్లడించిన రాజ్‌నాథ్
  • పాక్ అశాంతితో ఉందని వ్యాఖ్య

పాకిస్థాన్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోమారు నిప్పులు చెరిగారు. తమ దేశం జోలికి రావొద్దని హెచ్చరించారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే భారత సైన్యం బుల్లెట్ల లెక్కను చూసుకోదని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ పూర్తిగా అశాంతితో ఉందని, అందుకే భారత్‌ను రెచ్చగొట్టే పనికిమాలిన చర్యలకు దిగుతోందన్నారు.  

కాగా, పాకిస్థాన్‌పై మరోమారు సర్జికల్ దాడులు జరిపినట్టు పరోక్షంగా వెల్లడించారు. ఏం జరిగిందో చెప్పలేను కానీ ఏదో ఒకటి మాత్రం జరిగిందని అన్నారు. రెండు మూడు రోజుల క్రితమే అది సవ్యంగా జరిగిందని పేర్కొన్నారు. అదేంటనేది కొందరికి మాత్రమే తెలుసని, అసలేం జరిగిందనే విషయం మరికొన్ని రోజుల్లో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు.

రాజ్‌నాథ్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పాకిస్థాన్‌పై మరోమారు సర్జికల్ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్ మన పొరుగు దేశమని, వారిపై కాల్పులు జరపొద్దని సైన్యానికి తాను చెప్పినట్టు మంత్రి తెలిపారు. ఒకవేళ వారు కనుక మనపైకి వస్తే మాత్రం బుల్లెట్ల లెక్క చూసుకోకుండా విరుచుకుపడాలని సూచించినట్టు రాజ్‌నాథ్ తెలిపారు. 

More Telugu News