water ways traffic: జలరవాణా ట్రాఫిక్ నియంత్రణపై ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

  • ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నివేదిక సమర్పణ
  • జలరవాణా రంగంలో అభివృద్ధిపై సమగ్ర నివేదిక
  • జాతీయ, అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించిన కమిటీ

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న వాటర్ వేస్ ట్రాఫిక్, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ విస్తరణ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈమేరకు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జేసీ శర్మ, ఐపీఎస్ మాజీ అధికారి కె.దుర్గా ప్రసాద్, మాజీ చీఫ్ ఇంజనీర్ వైఎస్.సుధాకర్ లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈరోజు అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు ఈ నివేదికను అందించింది.

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న జలరవాణా రంగంలో (ప్యాసింజర్, గూడ్స్ రవాణాతోపాటు టూరిజం అండ్ వాటర్ స్పోర్ట్స్) అభివృద్ధి, విస్తరణకు వాటి పర్యవేక్షణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వం గత నవంబరు 20న జారీ చేసిన జీఓ ఆర్.టి.నంబరు 670 ఉత్తర్వుల ద్వారా ఈ కమిటీని నియమించింది. ముఖ్యంగా బోటు ఆపరేషన్స్ (నిర్వహణ) రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్, ప్రయాణికుల భద్రత, బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, రెగ్యులేటరీ క్రమబద్ధీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ జాతీయ అంతర్జాతీయంగా జలరవాణాకు సంబంధించి అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఈ నివేదికను అందించడం జరిగింది.

ముఖ్యంగా జలరవాణా నిర్వహణ, నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి ఈ కమిటీ విజయవాడ,ధవళేశ్వరంలో ఇందుకు సంబంధించి రేవుల శాఖ, జలవనరుల శాఖ, ఏపీ టూరిజం, ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలు, వివిధ వర్గాలవారితో పలు సమావేశాలను నిర్వహించింది.

అంతేగాక, బోటు యజమానుల సంఘం ప్రతినిధులతో మాట్లాడడంతో పాటు రాజమండ్రిలోని పుష్కర ఘాట్, ఇతర ఘాట్లను, విజయవాడలోని పున్నమి ఘాట్, పవిత్ర సంఘం ఘాట్ ను, పులిచింతల, ముక్త్యాల, జగ్గయ్య పేటల్లో జరుగుతున్న పనులను, పర్యాటక బోట్లు, వెస్సల్స్ ను పరిశీలించడంతోపాటు పవిత్ర సంగమం, పోలవరంలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతాలను ఈ కమిటీ పరిశీలించింది.

అంతేగాక, ఈ కమిటీ కేరళ రాష్ట్రంలో పర్యటించి అక్కడ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం కావడంతోపాటు ఢిల్లీలోని ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్లను, నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ సభ్యులుతోను సమావేశమై ఇన్ లాండ్ వాటర్ వేస్ రవాణాకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది.

ఈ కమిటీ ఇప్పటికే మార్చి 8న బోటు యాక్సిడెంట్లపై మధ్యంతర నివేదికను సమర్పించగా తుది నివేదికను ప్రభుత్వానికి ఈరోజు సమర్పించింది. చివరగా వివిధ అంశాలను పరిశీలించిన మీదట ఈ కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

More Telugu News