Madhya Pradesh: అధ్యాపకుడికి విద్యార్థుల టార్చర్ .. 'చదువు చెబుతూ పాపం చేశా'నంటూ కాళ్లు పట్టుకున్న ప్రొఫెసర్!

  • కాలేజీలో ఆందోళన చేసిన ఏబీవీపీ
  • క్లాస్ ను డిస్టర్బ్ చేయొద్దన్న ప్రొఫెసర్ గుప్తా
  • కాళ్లు పట్టుకునేవరకూ వదలని వైనం

బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) సభ్యులు రెచ్చిపోయారు. చదువు చెప్పిన ప్రొఫెసర్ అన్న గౌరవం లేకుండా దేశద్రోహి, అర్బన్ నక్సల్ అంటూ దూషించడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన సదరు అధ్యాపకుడు విద్యార్థుల కాళ్లను పట్టుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన మధ్యప్రదేశ్ లోని మంద్ సౌర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో దినేశ్ గుప్తా ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అయితే పరీక్షా ఫలితాల విడుదలలో జాప్యంపై ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు పవన్ శర్మ ఆధ్వరంలో కళాశాలలో నిరసన చేపట్టారు. తన క్లాస్ దగ్గరకు వచ్చి రచ్చ చేయడంతో అవతలకు వెళ్లిపోవాలని దినేశ్ గుప్తా వారికి సూచించారు. దీంతో ‘నీకు ఎంత ధైర్యముంటే భారత్ మాతా కీ జై, వందేమాతరం నినాదాలను అడ్డుకుంటావ్’ అంటూ దూషణలకు దిగారు. ‘నువ్వు ఓ దేశ ద్రోహివి, అర్బన్ నక్సల్ వి’ అంటూ దుర్భాషలాడారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన గుప్తా.. ‘నేను పిల్లలను చదివించే పాపం చేశాను.. నన్ను క్షమించండి’ ‘నేను పిల్లలను చదివించే పాపం చేశాను.. క్షమించండి’ అని చెబుతూ ఏబీవీపీ నేతతో పాటు అతనితో ఉన్న విద్యార్థుల కాళ్లకు వెంటపడి మరీ మొక్కారు. దీంతో వారందరూ అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ విషయమై ప్రొఫెసర్ గుప్తా మాట్లాడుతూ.. 'నిరసన పేరుతో నా క్లాస్ కు ఏబీవీపీ విద్యార్థులు అడ్డు తగిలారు. వాళ్లు నన్ను దేశ ద్రోహి అని నినాదాలు ఇచ్చారు. నేను క్షమాపణ చెప్పాలని కోరారు. సరే, అని వాళ్ల కాళ్లకు మొక్కా. ఈ క్యాంపస్‌లో గత 32 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. వారికన్నా నాకే దేశభక్తి ఎక్కువ. దేశభక్తిని ఒకరికి చూపించాల్సిన అవసరం నాకు లేదు. విద్యార్థులు బాగా చదువుకోవాలనే నేను కోరుతున్నా. చదువుకుంటేనే జీవితం బాగుంటుంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని నేను అనుకోవడం లేదు' అని దినేశ్‌ గుప్తా తెలిపారు.

More Telugu News